శుభం మహేశ్వరీ కోల్డ్ స్టోరేజ్ అగ్నిబాదిత రైతులకోసం 8న,చలో దుగ్గిరాల
రైతుసంఘల పిలుపు

రాష్ట్రవార్త తెనాలి :
మంగళగిరి నియోజక వర్గంలోని మండల కేంద్రమైన దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత రైతులను, ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8వ తేదీన చలో దుగ్గిరాలకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.
తెనాలి కొత్తపేటలోని ఎన్జీవో ఫంక్షన్ హాల్ లో మంగళవారం జరిగిన ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేశారు. 2024 జనవరి 19వ తేదీన కోల్డ్ స్టోరేజి లో జరిగిన అగ్నిప్రమాదంలో పసుపు రైతులు తీవ్రంగా నష్టపోయారని రాష్ట్ర పసుపు రైతు సంఘ నాయకులు ములకా శివ సాంబిరెడ్డి తెలిపారు. ప్రమాదంలో 300 మంది రైతులకు చెందిన , లక్ష 14 వేల బస్తాల పసుపు అగ్నికి ఆహుతి అయిందని వివరించారు. నాటి నుండి నేటి వరకు రెండున్నర సంవత్సరాలుగా అనేక రూపాల్లో పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి సరైన స్పందనలేదని అన్నారు. ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా
కోల్డ్ స్టోరేజీ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. శుభం మహేశ్వరీ కోల్డ్ స్టోరేజ్ వల్ల నష్టపోయిన పసుపు రైతులకు క్వింటాల్ కు రూ.7 వేలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రదర్శనగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఏవో శ్రీధర్ బాబుకు వినతి పత్రం అందజేశారు.వాస్ధవ పరిస్ధితిని వివరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. రైతులకు త్వరిత గతిన న్యాయం జరగాలన్న సంకల్పంతొ ఈనెల 8వ తేదీ సోమవారం చలో దుగ్గిరాలకు పిలుపునిచ్చారు. త్వరలో వ్యవసాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ధర్నా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ బాధిత రైతులు పాల్గొన్నారు.
