తెలుగు సినిమా యుగకర్త, దర్శక రత్న దాసరి నారాయణరావు: తెనాలిలో ఘనంగా 9వ వర్ధంతి వేడుకలు
తెనాలి (రాష్ట్ర వార్త ప్రతినిధి):
సినీ నటునిగా, దర్శకునిగా, రచయితగా, నిర్మాతగా, గీత రచయితగా వెయ్యి విద్వత్తుల బలం సాధించిన దర్శక రత్న డాక్టర్ దాసరి నారాయణరావు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పలువురు వక్తలు ఘనంగా నివాళులర్పించారు. తెనాలి కల్చరల్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో శనివారం దాసరి నారాయణరావు 9వ వర్ధంతి సభను తెనాలిలో అత్యంత వైభవంగా నిర్వహించారు.
తెలుగు సినీ పరిశ్రమకు దిక్సూచి దాసరి శకం: కంకిపాటి రమేష్ కుమార్:
ఈ కార్యక్రమానికి ‘రాష్ట్ర వార్త’ పత్రిక సంపాదకులు కంకిపాటి రమేష్ కుమార్ అధ్యక్షత వహించి మాట్లాడారు. రచయితగా, దర్శకునిగా, రాజకీయ నాయకునిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్న దాసరి నారాయణరావు పేరు నేటికీ చిరస్థాయిగా మార్మోగుతుందన్నారు. సినిమాకు హీరో చుక్కాని అయితే, దర్శకుడు కెప్టెన్ అని నిర్దేశించిన మహోన్నత వ్యక్తి దాసరి అని కొనియాడారు.
ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. “దర్శకునిగా పరిశ్రమలో తనదైన ముద్ర వేయడమే కాకుండా, దాదాపు 63 సినిమాల్లో రకరకాల పాత్రలు పోషించి హాస్యాన్ని, సెంటిమెంట్ను పండించి వినూత్న శైలిని కనబరిచారు. 250 చిత్రాలకు పైగా మాటల రచయితగా, దర్శకునిగా, నటునిగా ఆయన సాగించిన ప్రయాణం అనితర సాధ్యం. దాసరి శకం తెలుగు సినీ పరిశ్రమకు ఒక స్వర్ణయుగం, ఒక దిక్సూచి లాంటిది” అని పేర్కొన్నారు.
ప్రజాసేవలో భాగంగా ఆయన రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా విశేష సేవలందించారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటుడి అవార్డుతో పాటు, ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం, ఎన్టీఆర్ జాతీయ పురస్కారాలను అందుకోవడమే కాక వందలాది సన్మానాలు సొంతం చేసుకున్నారని తెలిపారు. వందలాది మంది దర్శకులను తయారు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
విశిష్ట భావాల సమాహారం దాసరి పాటలు:
ప్రముఖ సాహితీవేత్త ప్రొఫెసర్ పాతూరి సుబ్రమణ్యం మాట్లాడుతూ.. దాసరి నారాయణరావు కలం నుండి జాలువారిన పాటలు వినూత్నమైన భావాలతో, సమాజానికి మేల్కొలుపుగా ఉంటూ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో నేటితరం సినీ పరిశ్రమలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఘన నివాళులు – సాంస్కృతిక కార్యక్రమాలు:
ముందుగా సభ ప్రారంభానికి ముందు గాయకులు, సాహితీవేత్తలు, నటులు దాసరి నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చందు అనురాధ, యామిని స్వామి తదితరులు దాసరి చిత్రాలలోని మధురమైన పాటలను ఆలపించి సభికులను అలరించారు.
ఈ సంస్మరణ కార్యక్రమంలో జర్నలిస్ట్ నాయకులు మార్కండేయులు, ఓ. చందు, చందు సూర్య, బొమ్ము రామకృష్ణారెడ్డి, వెంకట్, అంబటి కిరణ్ కుమార్ తదితర ప్రముఖులు, సినీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

