After such a long time in Tirumala… something truly rare.
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. చాలా అరుదు ఇలా..

తిరుమలలో శనివారం అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. రికార్డు స్థాయిలో లక్షన్నర మంది భక్తులు దర్శించుకున్నారు. ఆదివారం కూడా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అలాగే శ్రీవాణి కరెంట్ బుకింగ్ టికెట్లను కూడా రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం రోజున వీఐపీ సిఫార్సు లేఖలను స్వీకరించమని టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి తెలిపారు.
తిరుమల లో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శనివారం రోజున రికార్డుస్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో సాధారణంగా రోజుకు సగటున 85 వేల నుంచి 87 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే శనివారం రోజున తిరుమల చరిత్రలోనే చాలా అరుదుగా లక్షన్నర మందికి పైగా భక్తులు శ్రీవారి దర్శనం కోసం తరలి వచ్చారు. ఇంత భారీ సంఖ్యలో భక్తులు రావడంతో టీటీడీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ శ్రీవారి భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ, క్యూ లైన్లలో అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి తెలిపారు.
శనివారం రోజున ఊహించని విధంగా భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్న నేపథ్యంలో.. భక్తులకు వీలైనంత త్వరగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెంకయ్య చౌదరి తెలిపారు. ఆదివారం రోజు కూడా తిరుమల శ్రీవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో..టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసింది. అందరినీ విధుల్లో కొనసాగిస్తున్నామని, అదనపు పోలీసు బలగాలను కూడా మోహరించినట్లు వెంకయ్య చౌదరి తెలిపారు.

