
రాష్ట్రవార్త తెనాలి:
రైతులకు ఆదాయం పెంచే ఉద్యానవన పంటలపై రైతులు ఆసక్తిని పెంచుకుని ప్రభుత్వం ద్వారా లభించే సబ్సిడీ ప్రయోజనాలు పొందుతూ, ఆయిల్ ఫామ్ సాగులో మన జిల్లాను రోల్ మోడల్ గా నిలపాలని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయిల్ ఫామ్ సాగు ప్రయోజనాలను వివరించారు.మండలంలోని కటెవరం గ్రామంలో రైతు అలపర్తి శ్రీనివాసరావు కు చెందిన ఎనిమిది ఎకరాల పొలంలో చేపట్టిన ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమం శనివారం రైతు అవగాహనా ప్రదర్శనగా నిర్వహించారు.
త్రీ ఎఫ్ ఆయిల్ పామ్ కంపెనీ సమకూర్చిన మొక్కలను, మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిధిగా పాల్గొని పొలంలో నాటారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతు రాష్ట్రంలో ఏలూరు జిల్లాలో దాదాపుగా రైతులందరూ ఆయిల్ పామ్ ఉద్యాన తోటలను సాగు చేస్తున్నట్టు చెప్పారు. శాస్త్ర సాంకేతికను అందిపుచ్చుకొని ఉద్యాన పంటలపై రైతులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. హెక్టార్కు 71 వేల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని వెల్లడించారు. మూడు సంవత్సరాల తర్వాత ఆయిల్ పామ్ తోట పంట చేతికి వస్తుందని, ఇందులో అంతర్ పంటలు వేసుకోవచ్చన్నారు ఎకరాకు కనీసం రెండు లక్షలకు పైగా ఆదాయం ఉంటుందని తెలిపారు. ప్రకృతి విపత్తుల నుండి తట్టుకునేందుకు, ఆయిల్ పామ్ సాగు దోహదపడుతుందని అన్నారు. మనదేశంలో వంట నూనెల వినియోగం ఎక్కువగా ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు సబ్సిడీతో పాటు ఖచ్చితమైన ధర కల్పిస్తున్నట్టు వెల్లడించారు. జిల్లాలో 300 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని ప్రభుత్వం నిర్దేశించినట్టు తెలిపారు. మండల తహశీల్దార్ కెవి. గోపాలకృష్ణ మాట్లాడుతు రైతుల ఆదాయ వనరులను పెంచేందుకు, ఎంతో దూర దృష్టితొ తెనాలి నియోజకవర్గంలో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రాధాన్యం కల్పించడం ఆనంద దాయకమని చెప్పారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ బి. రవీంద్రబాబు, వ్యవసాయ శాఖ ఏడిఏ ఆర్. విజయ్ బాబు, ఉద్యానవన శాఖ మండల అధికారి యు.శ్రీ నిత్య, మండల వ్యవసాయ అధికారి కే. సుధీర్ బాబు, ఎంపీడీవో అత్తోట దీప్తి, ఎంఈఓ వి. జయంతి బాబు, త్రీ ఎఫ్ ఆయిల్ ఫామ్ కంపెనీ జోనల్ మేనేజర్ బి. విజయసారథి, ఏరియా మేనేజర్ బి. సురేంద్ర, వ్యవసాయ సహాయకురాలు సాయిదుర్గ వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.
